గౌతమ్.. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను: నమ్రత శిరోద్కర్

  • ఆసుపత్రిలో చిన్నారులతో సమయం వెచ్చిస్తున్న గౌతమ్
  • వారు త్వరగా కోలుకునేందుకు తన వంతు సాయం
  • ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన నమ్రత
తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని చేసిన పనికి తల్లిగా నమ్రత శిరోద్కర్ ఉప్పొంగి పోయింది. మహేశ్ బాబు ఫౌండేషన్ చేసిన పోస్ట్ ను ఆమె రీషేర్ చేసింది. మహేశ్ బాబు ఫౌండేషన్ తరఫున గౌతమ్ రెయిన్ బో ఆసుపత్రిలో పిల్లలకు గిఫ్ట్ బాక్స్ లు అందిస్తున్న ఫొటోను ఇక్కడ చూడొచ్చు. దీన్ని మహేశ్ బాబు ఫౌండేషన్ పోస్ట్ రూపంలో పంచుకోగా, నమ్రత స్పందిస్తూ.. ‘‘నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను గౌతమ్’’ అంటూ ఎమోజీని పోస్ట్ చేసింది. 

మహేశ్ బాబు ఫౌండేషన్ రెయిన్ బో హాస్పిటల్స్ తో కలసి పనిచేస్తోంది. చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. కేన్సర్ బారిన పడిన చిన్నారుల చికిత్సలకు సైతం సాయం చేస్తోంది. ‘‘ఫౌండేషన్ లో భాగమైన గౌతమ్ తన స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఖాళీ సమయాన్ని ఆసుపత్రిలోని ఆంకాలజీ (కేన్సర్), కార్డియో వార్డుల్లోని చిన్నారులతో వెచ్చిస్తున్నాడు. ఒకవైపు చికిత్సతో స్వస్థత పొందుతున్న చిన్నారులను సంతోషంగా ఉండేలా చేస్తున్నాడు. చిన్నారుల్లో సంతోషానికి కారణమవుతూ, వారు త్వరగా కోలుకునేలా చేస్తున్నందుకు గౌతమ్ కు ధన్యవాదాలు’’ అంటూ మహేశ్ బాబు ఫౌండేషన్ తన పోస్ట్ లో పేర్కొంది.

‘తండ్రి మాదిరే కుమారుడు’ అంటూ ఓ అభిమాని తన స్పందనను కామెంట్ రూపంలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ స్పందిస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు.

Gautam
Namrata Shirodkar
Mahesh Babu
spends time
childrens hospital

More Telugu News